Subscribe

RSS Feed (xml)

Powered By

Skin Design:
Free Blogger Skins

Powered by Blogger

Tuesday, July 14, 2009

ముక్త్యాలలో మరచిపోలేని అనుభూతులు

కొన్ని ప్రదేశాలలో మనం వున్నది చాలా తక్కువ సమయం అయినా మరచిపోలేని అనుభూతులు మూటకట్టుకుని వస్తాము. అలాంటి అనుభూతులు, ముక్త్యాల తలుచుకోగానే గర్తుకొచ్చేవి మీతో పంచుకోవాలనిపించింది.

2008 కార్తీకమాసంలో కూర్చున్నదానికి కూర్చున్నట్లే ఒక ఆలోచన వచ్చింది. ఈ మారు కార్తీక మాసంలో గుళ్ళో దీపాలు పెట్టాల్సిందే. ఆ పెట్టేదేదో 108 లింగాల దగ్గర పెడితే బాగుంటుందికదా. అంతే నా ఆలోచన వెంటనే మావారికి చెప్పటం..ఇద్దరం కలిసి ఎక్కడెక్కడ గుళ్ళున్నాయో ఆలోచించటం మొదలు పెట్టాము. మర్నాడు ప్రొద్దున్నఆయన ఆఫీసుకెళ్ళేలోపల కాలనీ దగ్గర వున్న 3 గుళ్లకెళ్ళి దీపాలు పెట్టి వచ్చాను. ఎంత లిస్టు వేసినా అంతంత దూరాలు వెళ్ళి 108 శివ లింగాల దగ్గర దీపాలు పెట్టాలంటే ఎంతకాలం పడుతుందో అనే ఆలోచన. ఇంతలో ఆఫీసునుంచి వెంకట్ (మా వారు) ఫోన్ చేశారు. ముక్త్యాల కోటిలింగ క్షేత్రంలో శివలింగాల ప్రతిష్ట జరిగిందేమో కనుక్కో..అక్కడ ప్రతిష్ట జరిగితే చాలా శివ లింగాలు వుంటాయికదా. నీకెన్ని దీపాలు కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు అన్నారు. వెంటనే ఫోన్ చేస్తే శివ లింగ ప్రతిష్టలు జరుగుతున్నాయి, కొన్ని వేల లింగాల ప్రతిష్ట జరిగింది అన్నారు. ఆ శని, ఆదివారాలలో ముక్త్యాల ప్రయాణం అనుకున్నాము. వెంటనే ప్రమిదలు మిగతా అవసరమైన వస్తువులు సమకూర్చుకోవటం మొదలు పెట్టాము. మేమిద్దరం, మా స్నేహితురాళ్ళు ఇంకో ముగ్గురం కలిసి పొద్దున్న బయల్దేరి ముక్త్యాల చేరేసరికి మధ్యాహ్నమయింది. ఆరోజు మధ్యాహ్నం ఏమీ తోచక బల్లకట్టుమీద కారుతో సహా అవతల ఒడ్డుకు వెళ్ళాం. ఆ ఒడ్డునుంచీ అంతా గుంటూరు జిల్లా. అక్కడనుంచి కేతగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర అంటే వెళ్ళొద్దామనే ఉద్దేశ్యం. కొంచెం దూరం వెళ్ళేసరికి ముక్త్యాల కృష్ణ ఒడ్డున చూసిన ప్రకటన శ్రీ అష్టముఖ గండభేరుండ బడబానల జ్వాలా లక్ష్మీ నృసింహస్వామి బోర్డు కనిపించి వెళ్ళి చూసి వచ్చాము. దీనిగురించి వేరే పోస్టు రాస్తాను. అక్కడ తెలిసింది కేతగిరి అడవి మర్గాన వెళ్తే అక్కడికి దగ్గరే కానీ కొన్ని మైళ్ళు నడచి వెళ్ళాలి..రోడ్డు మార్గాన అయితే అటునుంచి దూరమని. తిరిగి వస్తూ ముక్త్యాల శ్రీ ముక్తేశ్వరాలయంలో 365 ఒత్తులతో దీపాలు పెట్టాము. తర్వాత శ్రీ కోటిలింగ క్షేత్రం చేరేసరికి బాగా చీకటి పడింది. చీకట్లోనే దీపాలు బాగుంటాయనుకున్నాము. మర్నాడు అభిషేకం, లింగ ప్రతిష్ట చెయ్యాలని అడిగితే, ఉదయం 10 గం. కి రమ్మన్నారు. ఇంక అప్పుడు నా కోరిక, 108 శివలింగాల దగ్గర దీపాలు పెట్టాను. మా స్నేహితురాళ్లుకూడా వేరే కొన్ని పెట్టారు. ఆ దీపాలు పెట్టటానికి, నాకు మాముగ్గురు స్నేహితురాళ్ళు సహాయం చేస్తే 3 గంటలు పట్టింది. అన్ని శివలింగాలముందు ఆ దీపాలు చాలా అద్భుతంగా కనిపించాయి. దీని గురించి అంతరంగ తరంగాలలో అప్పుడు రాసిన పోస్ట్ కార్తీక దీపాలు చూడండి.

మర్నాడు ఉదయం ముందుగా వేదాద్రి వెళ్ళి కృష్ణ స్నానంచేసి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానంతరం, ముక్తేశ్వరాలయానికి బయల్దేరాము. ఆ రోజు నాగుల చవితి. మా స్నేహితురాళ్ళు నాగులచవితి కోసం ఇంటినుంచి ప్రసాదాలు తయారుచేసి తెచ్చారు. వెళ్ళేది గుళ్ళకి కదా ఎక్కడోక్కడ వినియోగించవచ్చని. కిందటిరోజు ముక్తేశ్వరాలయానికి వెళ్ళినప్పుడు గుళ్ళో ముందు పెద్ద పుట్ట చూశాము.

అనుకోకుండా కృష్ణస్నానం చేశాం, పుట్ట వున్న గుడికి వెళ్తున్నాము..ఎక్కడన్నా పాలు దొరికితే పుట్టలో పాలు కూడా పొయ్యచ్చని అనుకున్నామోలేదో ఎదురుకుండా సైకిల్ మీద పాల క్యానులు తీసుకెళ్తున్న వ్యక్తి. వెంటనే ఆ అబ్బాయిని ఆపి అడిగాము ఆవు పాలున్నాయా అంటే వున్నాయన్నాడు. మరి ఎలా తీసుకెళ్ళాలి బ్రిలియంట్ ఐడియా. ఒక నీళ్ళ బాటిల్ తీసి నీళ్ళు ఒంపేసి పాలు పోయించాం. ఇంక చూసుకోండి మా సంబంరం. నాగుల చవితి రోజు శ్రీ ముక్తేశ్వరాలయంలో ప్రాచీనమైన పుట్టకి పూజ చెయ్యటం. పాలు పోస్తుంటే మళ్ళీ సైంటిఫిక్ ఆలోచనలు..పాములని బాధ పెడతామేమోనని..పైగా ముందునుంచీ నాగుల చవితి పూజ ఇంట్లోనే చెయ్యటం అలవాటు. అందుకే ఒక్కచుక్కే పాలు పోసి పూజ చేశాము.

తర్వాత శ్రీ కోటిలింగక్షేత్రంలో శివునికి అభిషేకం, శివలింగ ప్రతిష్ట చేసి భోజనాలయ్యాక హైదరాబాదు తిరుగు ప్రయాణం లో బోనస్ గా సూర్యాపేట దగ్గర పిల్లలమఱ్ఱి ప్రాచీన శివాలయాల్లో దైవ దర్శనం, దీపారాధన కార్తీక మాసంలో రెండు రోజుల్లో ఇన్ని కార్యక్రమాలు ఎలా మరచి పోతాను.

Thursday, July 9, 2009

శ్రీ ముక్తేశ్వరాలయం, ముక్త్యాల

బల్లకట్టు మీద లారీలు
ముక్త్యాల రాజాగారి బంగళా

శ్రీ ముక్తేశ్వరస్వామి ఆలయం, ముక్త్యాల

ముక్త్యాలలో శ్రీ కోటిలింగశివ క్షేత్రానికి 2 కి.మీ. ల దూరంలో వున్నది అతి పురాతనమైన శ్రీ ముక్తేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయంలో శివలింగం బలి చక్రవర్తిచే ప్రతిష్టింపబడ్డది. పక్కన అమ్మవారి గుళ్ళో శ్రీచక్రంకూడా ప్రతిష్టింపబడివుంది. శివ కేశవులకు బేధం లేదన్నట్లు చెన్న కేశవ స్వామి ఆలయం కూడా ఈ ప్రాకారంలోనే వుంది. ఇక్కడ కృష్ణా నది ఉత్తర వాహిని. ఈ క్షేత్రం ఉత్తర కాశీగా పరమ పావన పుణ్య తీర్ధంగా ప్రసిధ్ధికెక్కింది. పలు పురాణాలలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావన వున్నది.

ఈ స్వామిని త్రేతాయుగంలో రామ లక్ష్మణులు, ద్వాపర యుగంలో పాండవులు దర్శింటారుట. ఎఱ్ఱన, శ్రీనాధుడు మొదలగు మహాకవులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు వారు రాసిన గ్రంధాలలో వున్నది.

త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి ఇక్కడ ఆశ్రమం ఏర్పాటుచేసుకుని నిత్యం ఉత్తరవాహినిలో స్నానంచేసేవారని మార్కండేయ పురాణంలో వున్నది. నదీ ప్రవాహంలో ఆయనకు జంట నందులు కనిపించేవిట. కృష్ణ ఒడ్డున జంట నందుల విగ్రహాలు వున్నాయి. ఇప్పటికీ నది లోతులో బంగారు శివాలయం వుందని భక్తుల నమ్మకం. ఋష్యశృంగ మహర్షి ఇక్కడికి సమీపంలో వున్న కొండగుహలో తపస్సు చేసేవారుట. అప్పుడు ఆ గుహ నుండి నిరంతరం సామవేదగానం వినిపించేదిట.

గుడి తెరచి వుంచు వేళలు ఉదయం 6 గం. ల నుండి మధ్యాహ్నం 12 గం. ల దాకా తిరిగి సాయంత్రం 5 గం. ల నుంచి 8 గం. ల దాకా. మీరు వెళ్ళిన సమయంలో గుడి మూసి వుంటే గుడి మొదట్లో వున్న షాపులో అడగండి. పూజారిగారి ఫోను నెంబరు దొరకవచ్చు. ఆయన ఇల్లు సమీపంలోనే. వస్తారు.

ఇక్కడి జమీందారులు ముక్త్యాల రాజావారు లబ్ధప్రతిష్టులు...కీర్తిశేషులు. వారి గురించి మేము ఎక్కువ వివరాలు తెలుసుకోలేకపోయాముకానీ కృష్ణ ఒడ్డునుంచీ వాళ్ల బంగళా ఫోటో తియ్యగలిగాము.

సరదా వున్న పట్న వాసులు చూడదగ్గ ఇంకో విశేషం బల్లకట్టు. గుడి దగ్గరనుంచి కొంచెం దూరం వుంటుంది. ఈ బల్లకట్టు మీద మనుషులతోపాటు ఒకేసారి మూడు లారీలను ఎక్కించి అవతలి ఒడ్డుకి చేరుస్తారు. కావాలంటే మీరు కూడా మీ వాహనంతో సహా ఆ బల్లకట్టుమీద అవతలి ఒడ్డుకెళ్ళచ్చు.

Tuesday, July 7, 2009

శ్రీ కోటిలింగ క్షేత్రం, ముక్త్యాల

గుడి ప్లాను

ముక్త్యాల

కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలంలో ప్రసిధ్ధి చెందిన ముక్త్యాల చూశారా? జగ్గయ్యపేట హైదరాబాదు విజయవాడ రహదారిలో హైదరాబాదునుంచి 200 కి.మీ., కోదాడనుంచి 25 కి.మీ., విజయవాడనుంచి 70 కి.మీ. ల దూరంలో వున్నది. ఇక్కడికి 10 కి.మీ. ల దూరంలో వున్నది ముక్త్యాల. జగ్గయ్యపేట నుండి ఆటోలో వెళ్ళి రావచ్చు. బస, భోజనం, జగ్గయ్యపేట లోనే.

శ్రీ కోటిలింగ మహా శివ క్షేత్రం, ముక్త్యాల

జగ్గయ్యపేట నుంచి 8 కి.మీ. ల దూరంలో ఉత్తర వాహిని అయిన కృష్ణా నదీ తీరంలో 54 ఎకరాల స్ధలంలో ఇంకా నిర్మాణ దశలో వున్న ఈ మహాద్భుత ఆలయ సముదాయం పూర్తవటానికి ఇంకో 7, 8 ఏళ్ళు పట్టవచ్చు. ఈ ఆవరణలోవున్న శ్రీ పంచముఖ అమృత లింగేశ్వరస్వామి వారి దేవాలయము సుమారు 55 అడుగుల ఎత్తయిన ఐదు అంతస్తుల విమాన గోపురంతో, 4 ద్వారములతో, 4 ధ్వజస్ధంబములతో అలరారుతోంది. ఏ ద్వారంనుంచయినా స్వామి నగుమోము దర్శనం అవుతుంది. శివాలయానికి ముందు మహా మండపం, అందులో రెండు వైపులా శ్రీ కామాక్షి, విజయ గణపతుల దేవాలయాలున్నాయి. ఇంకా కశ్యప మహర్షి రచించిన కాశ్యప శిల్ప శాస్త్ర ప్రమాణముతో 32 శివ గణ పరివారాలయములు, 27 శివలీల మూర్తులు, 27 శక్తి ఆలయములు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు షట్ గణపతులు, షట్ సుబ్రహ్మణ్యులు వగైరా 108 దేవతా మూర్తులకు గుళ్ళు సిధ్ధమవుతున్నాయి. వీటిలో కొన్ని గుళ్ళల్లో దేవతా విగ్రహాల ప్రతిష్ఠ పూర్తయి పూజలందుకుంటున్నాయి. కొన్ని గుళ్ళు నిర్మాణ దశలో వున్నాయి. ఇవికాక కోటి శివలింగాలని ప్రతిష్ఠిస్తారు. ఈ ప్రతిష్ఠలు గూడా మొదలయి ఇప్పటికి కొన్ని వేల లింగాల ప్రతిష్ఠ పూర్తయింది.. ఇవ్వన్నీ పూర్తయ్యేసరికి ఈ క్షేత్రం ఎక్కు పెట్టిన బాణం ఆకారంలో వస్తుందట.

ఈ ఆలయ నిర్మాణం కంచికచర్ల వాస్తవ్యులు శ్రీ గద్దె ప్రసాద్, పావని గార్ల శుభ సంకల్పంతో, భద్రాచల వాస్తవ్యులు శ్రీ మందరపు వెకటేశ్వర్లు స్ధపతి ఆధ్వర్యంలో జరుగుతోంది.

ఇక్కడ 1,50,000 రూ. కడితే ఒక గుడి దగ్గర డోనర్స్ పేరు పెడతారు పైగా ఆ ఆలయంలో దేవతా మూర్తులను వాళ్ళచేత ప్రతిష్టింప చేస్తారు. ఇంకా 639 రూ. లు కడితే ఒక శివలింగాన్ని మనం ప్రతిష్ఠించవచ్చు కానీ ఎక్కడా మనపేరు కనబడదు. ఇవి కాక కాటేజ్ లు కూడా కడుతున్నారుట. వీటికి 70 వేల రూపాయలు కడితే ఏడాదికి 30 రోజులు డోనర్స్ అక్కడ వుండవచ్చు.

దర్శన సమయాలు ఉదయం 6 గం. ల నుంచి 1-00 గం. దాకా, సాయంత్రం 4-00 గం. లనుంచి 7-00 గం. లదాకా.

ఇంకా వివరాలు కావాల్సిన వారు ఈ క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

08654320355 93462 19357 98854 64888 94407 11348 93938 ६१४०९

Sunday, July 5, 2009

జగ్గయ్యపేట మండలంలోని దేవాలయాలు

జగ్గయ్యపేట మండలంలోని దేవాలయాలు

28-5-2009 తేదీ ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో ప్రచురించబడిన నా వ్యాసం స్కాన్ చేసి ఇక్కడ పోస్టు చేస్తున్నాను.

Friday, July 3, 2009

అమెరికాలో జగన్నాధ రధ యాత్ర

అమెరికాలో జగన్నాధ రధ యాత్ర జగన్నాధుడు సకల జగాలనేలే నాధుడు, ఆయనకు అమెరికా ఏమిటి ఆస్ట్రేలియా ఏమిటి అంటారా నిజమేననిపించింది నాకూను జూన్ 20 వ తారీకున మిచిగాన్ లోని నొవై సివిక్ సెంటర్ లో జరిగిన జగన్నాధుని రధయాత్ర చూస్తే. ఇదివరకు నేను విదేశాల్లో మనవారు మన పండగలు మిస్ అవుతున్నారని బాధ పడేదాన్ని. కానీ ఇప్పుడు మేము ఇండియాలో ఎప్పుడూ పాల్గొనని జగన్నాధ రధయాత్రలో అమెరికాలో పాల్గొన్నామనుకుంటుంటే కొంత ఆశ్చర్యంగా, చాలా ఆనందంగా వుంది. మేమే కాదు మాలాంటి ఎందరో కనిపించారు అక్కడ. డెట్రాయిట్ ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో సాగిన ఈ రధ యాత్రలో వేల సంఖ్యలో భారతీయులు పాల్గొన్నారు. పెద్ద చెక్క రధం మీద బలరాముడు, కృష్ణుడు, సుభద్ర విగ్రహాలతోబాటు అమెరికాలో హరే కృష్ణ మూవ్ మెంట్ ప్రారంభించి, కృష్ణ భక్తిని ప్రారంభించి ప్రచారం చేసిన భక్తి వేదాంత స్వామి ప్రభుపాదగారి విగ్రహంకూడా ఊరేగించారు. ఆ విగ్రహాన్ని మొదట చూసినప్పుడు ఆయనే అక్కడ కూర్చున్నారనుకుంటాము. అంత సజీవంగా వుంది. రధ యాత్ర సాగుతున్నంతసేపూ రధంమీద వేంచేసివున్న బలరామకృష్ణ, సుభద్రలకు పూజలు, హారతులు, నైవేద్యాలు జరుగుతూనే వున్నాయి. రధంముందు కృష్ణ భక్తులు ఆడవారు ఒక గ్రూపుగా మగవారు ఇంకొక గ్రూపుగా మైమరచి నాట్యం చేస్తూనే వున్నారు. కృష్ణ భజనలు సాగుతూనే వున్నాయి. రోజు మొత్తం సాగిన ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అందరికీ ప్రసాదాలు, మంచినీటి బాటిల్స్, మధ్యాహ్న భోజనాలు, రోజంతా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు।

Sunday, June 28, 2009

నా బ్లాగు పుట్టిన రోజు

నా బ్లాగు పుట్టిన రోజు

28-6-2009 న నా బ్లాగు పుట్టిన రోజు. సరిగ్గా ఏడాది క్రితం ఈ రోజు ప్రాణం పోసుకున్న నా బ్లాగు ప్రయాణంలో ఎన్నో మజిలీలు, ఎన్నో పరిచయాలు, ఎన్నో గుర్తింపులు..అన్నీ మధురమైన జ్ఞాపకాలే. ఎందరో సలహాదారులు, ఇంకెందరో స్నేహితులు అందరికీ కృతజ్ఞతాపూర్వక అభివందనలు. ప్రమదావనంలో ఎన్నో సరదాలు, ఎంతో సందడి...అవ్వన్నీ అతి మధురాలు. వెరసి రిటైరయిన తర్వాత కూడా ఖాళీ లేకుండా, సమయం వృధా చేయకుండా గడిపాను ఈ ఏడాదీ. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా తెలుగు బ్లాగర్ల గుంపుకు పరిచయం చేసిన శ్రీ దూర్వాసుల పద్మనాభంగారికి, ప్రమదావనం సందడిలోకి ఆహ్వానించటమేగాక నా బ్లాగు డిజైన్ చేసి, అవసరమైనప్పుడల్లా సలహాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న శ్రీమతి జ్యోతి వలబోజుగారికు ప్రత్యేక కృతజ్ఞతలు.

ఈ సహాయ సహకారాలు ఇలాగే కొనసాగాలని, తోటి బ్లాగర్ల ప్రోత్సాహ ప్రవాహం నిరాటంకంగా వుండాలనీ కోరుకుంటున్నాను. ఈ బ్లాగు ప్రయాణంలో నన్ను ప్రోత్సహించిన మీ అందరికీ, ఇంకా అన్ని విధాలా ప్రోత్సహిస్తున్న మావారు శ్రీ వెంకటేశ్వర్లు కీ నమస్సుమాంజలులు. మా పిల్లలకి ఆశీస్సులు.

చివరిగా ఒక్కమాట..వయసు లో పెద్దవారమని, ఏమంటే ఏమనుకుంటారోనని కొంతమంది దూరంగా వుంటున్నారు. ఈ బ్లాగు ప్రపంచంలో బ్లాగర్ల మధ్య వుండాల్సినది అభిమానం, సద్విమర్శ వగైరాలేగానీ పెద్దవారని దూరంగా వుంచటంకాదు. పెద్దవాళ్ళు బ్లాగు ప్రపంచంలో అడుగు పెట్టటానికి కారణం ఇవ్వన్నీ మర్చిపోవటానికే. ఇక్కడ అందరూ సమానులే అని కొందరు బ్లాగు మిత్రులు ఇదివరకే చెప్పిన మాటలు నిజంగా నిజంకావాలని కోరుతున్నాను.

మిత్రులందరూ నా బ్లాగుకి ఆశీర్వచనం పలకమని కోరుతున్నాను.

Saturday, June 20, 2009

శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, వాడపల్లి

ఆలయం లోపల దృశ్యం
ఆలయ గోపురం

శ్రీ వెంకటేశ్వరస్వామివారి దేవస్ధానము, వాడపల్లి

ఆత్రేయపురం మండలం, తూర్పు గోదావరి జిల్లాలోని వాడపల్లి తీర్ధం గురించి చాలామంది వినే వుంటారు. ప్రతి సంత్సరం చైత్రశుధ్ధ ఏకాదశినాడు ఈ వాడపల్లిలో వెలిసిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి కళ్యాణం, తీర్ధం జరుగుతుంది. ఈ వేడుకలు చూడటానికి వేలాదిమంది భక్తులు తరలి వస్తారు.

పూర్వం దండకారణ్యంగా పిలువబడిన ఈ ప్రాంతంలో అనేక మంది ఋషిపుంగవులు తపస్సుచేశారు. ఎందరో మహాఋషుల తపస్సుతో పావనమైన ఈ ప్రదేశంలో, పవిత్ర గోదావరి నదిలో 300 సంవత్సరాలక్రితం లభ్యమైన స్వామి విగ్రహాన్ని మేళతాళాలతో తోడ్కొనివచ్చి ఆగమ శాస్త్ర ప్రకారం గుడిలో ప్రతిష్ట చేశారు. తర్వాత పెద్దాపురం సంస్ధానాధీశులు శ్రీ వత్సవాయి తిమ్మజగపతిరాజు స్వామివారిని దర్శించి స్ధిరాస్తులు సమర్పించారు.

స్వయంభూ అయిన ఈ స్వామి విగ్రహం రక్తచందనం చెక్కలో మూర్తీభవింపబడ్డది. ఇటువంటి చెక్క విగ్రహం ఒక్క వాడపల్లిలోనే వుందంటారు.

భారతదేశ ప్రజలు గర్వించదగిన విషయం ఇంకొకటి జరిగింది ఇక్కడ. 1931వ సంవత్సరంలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న దేశభక్తులు ఈ స్వామివారి ఉత్సవంలో రధంపై స్వరాజ్యకేతనాన్ని బాపూజీ చిత్రపటంతో సహా ఊరేగించి మనవారి వీరత్వాన్ని, దేశభక్తిని చాటి చెప్పారు. అంతటి పుణ్యభూమి ఇది.

ఏటా వాడపల్లి తీర్ధంనాడేకాక నిత్యం వేలాదిమంది భక్తులు సందర్శించే ఈ దేవస్ధానం రావులపాలెంనుంచి లొల్లమీదుగా ప్రయాణిస్తే కేవలం 8 కి.మీ. ల దూరంలోనే వుంది.

దేవాలయం ఫోన్ నెంబరు 08855 271888